Sunday, September 5, 2010

గురు వందనం

శ్రీ గురుభ్యోనమః

స్రుష్టి లోని గురువులందరికి పాదాభివందనాలు చెయ్యటానికి ఒక ప్రత్యేకమైన దినం ఏమీ అక్కరలేక పోయినా, ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నాము కనుక ఇవ్వాళ్ళ విశేషమైన దినం గా మరింత శ్రద్ధ గా గురువుని తల్చుకుందాము.

ముందుగా "మమతాను రాగాల కల్పతరువై, మంచి చెడు నేర్పించు మాత్రు పద పద్మముల కిదె తొలి వందనం"(ఒక కవి గారి మాట).

ఒక వ్యక్తి జీవితం లో అత్యంత ప్రముఖమైన స్థానం తల్లిదండ్రులది. వీరిలో కూడా తల్లి నే ముందుగా తల్చుకుంటారు ఎందుకంటే, తల్లి తొలి గురువు. ఆ తరువాతి స్థానం ఆచార్యుడిది.ఆచార్యుడి స్థానం విశిష్టమైనది.

అందుకే మన సాంప్రదాయం లొ "మాత్రు దేవోభవ, పిత్రు దేవోభవ,అచార్య దేవోభవ" (తరువాత అతిధి దేవొభవ అంటారు, ఆ ప్రస్తావన ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి)అంటాము.

గురువు అనే ప్రస్తావన రాగానే, మనకి ముందు గా గుర్తు వచ్చేది, గురు దత్తాత్రేయ, మేధా దక్షిణా మూర్తి, ఒక విశ్వామిత్రుడు, ఒక పరశురాముడు,తరువాత మానవ శరీరాన్ని స్వీకరించి జగత్తుని ఉద్ధరించిన జగద్గురు ఆది శంకరాచార్య, ఒక ద్రోణాచార్య, మొదలైన వారు.

ఈ కాలం లో అయితే, ఒక సర్వేపల్లి రాధాక్రిష్ణన్, ఒక అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారిని, మీకు దైవమూ,గురువూ ఒకే సారి ప్రత్యక్షం అయితే మీరు ముందు గా ఎవరికి నమస్కరిస్తారు అని అడిగితే, తొలి నమస్కారం గురువుకే అని చెబుతూ, ఆ దైవాన్ని కూడా చూపించింది గురువే కదా అని వివరణ ఇవ్వటం జరిగింది. అది, గురువు యొక్క స్థానం.

ఇక ఆది శంకరాచార్య విషయం లో గురు అనుగ్రహం ఉంటే సాధించలేనిది లేదని నిరూపించారు. ఒక రోజు పాఠం మొదలు పెట్టకుండా, కొంచెం సేపు ఆగివేచి చూస్తున్నారట. మిగిలిన శిష్యులు ఆచార్యా, అందరము ఉన్నాము కదా, ఎవరి కోసం వేచి ఉన్నారు అని అడిగితే, తోటకాచార్యుడు రావాలి కదా అన్నారట.అతనికి మేధస్సు తక్కువ, అతను శారీరక శ్రమ చేసే వ్యక్తే కానీ, చెప్పింది గ్రహించగల నేర్పు కానీ, ధారణ చెయ్యగల మేధస్సు కానీ లేవు అని మిగిలిన శిష్యులు వ్యాఖ్యానిస్తే, గురువుగారు నవ్వి తోటకాచార్యుడిని పిల్చి, శ్లోకాలు చెప్పమంటే ఆశువుగా గురువు గారి మీద చెప్పిన స్తోత్రాలు విని ఆశ్చర్య పోవటం మిగిలిన శిష్యుల వంతు అయిందిట. ఈ నాటికీ గురు వందనానికి ఆ శ్లోకాలే ప్రామాణికం గా చెప్పబడుతున్నాయి.

అది గురు అనుగ్రహమంటే.

శిష్యులని పరిశీలన గా చూసి ఎవరి శక్తి ఎంతో, ఎవరికి ఎందులో నైపుణ్యం ఉన్నదో అంచనా వేసి అందులో వారిని నిష్ణాతులని చెయ్యటమే గురువు గారు చేసే పని. అది వారికి జీవితం లో ముందు ముందు సరి అయిన దారి చూపిస్తుంది అని మన సనాతన ధర్మం, చరిత్ర,మరియు అనుభవము చెబుతున్నాయి.

ఇంక నా విషయానికి వస్తే, ప్రాధమిక విద్యా స్థాయి నించి చెప్పుకుంటూ వస్తే -

7త్ క్లాస్స్ లో ఉండగా, విజయవాడలో, మా తెలుగు టీచర్ ఒక నాడు (నేను సంవత్సరం మధ్యలో ఆ స్కూల్ లో చేరటం జరిగింది)బాల క్రిష్ణ లీలల నించి "చల్దులారగించుట" అనే పద్య భాగం లో ఒక పద్యం లోని ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దెబ్బ వేసి నా సహాధ్యాయి చేత చెప్పించటం చూసి, భయం తో నేను అప్పటికప్పుడు నోటికి నేర్చుకున్న పద్యం ఇప్పటికీ నా మనసులో అలా ఉండి పోయింది.

ఇక 10త్ క్లాస్స్ కి మేము హైదరాబాద్ కి రావటం జరిగింది. అక్కడ కేశవ్ మెమోరియల్ స్కూల్ లో మాకు లెక్కలకి ప్రమీల టీచర్ వచ్చే వారు. ఆవిడ మొట్ట మొదటి రోజు నన్ను చూసి, కొత్త స్టూడెంట్ ని అనుకోకుండా, నా తెలివితేటలు తెలియక పోయినా, ఒక్క సారిగా నా భుజం తట్టి నువ్వు మ్యాథ్స్ లో నేషనల్ అవార్డ్ తెచ్చుకుంటావా అని అడగటం నాకు మనో ఫలకం మీద అలా ముద్ర పడి పోయింది. ఆవిడ లెక్కలు చెప్పే విధం ఎంత సులువు గా ఆత్మీయం గా ఉండేదో చెప్పాలంటే, ఆ స్కూల్ లో ఒక బిలోయావరేజ్ విద్యార్ధి కూడా 90% పైన మార్కులు తెచ్చుకోవటం చూస్తే అర్ధం అవుతుంది. ఆవిడ తర్ఫీదులో నేను ఎప్పుడూ, ఎలాంటి కొత్త లెక్క ఇచ్చినా వెంటనే నిముషాలలో చేసే దాన్ని. లెక్కల పట్ల నాకు ఉన్న ఇంట్రస్ట్ ని, నేను ఇంట్లో వాళ్ళ లెక్కల భయం వలన,కొన సాగించలేక పోయాను.

మళ్ళీ ఎమ్మే స్థాయి లో, ఎకనామిక్స్ లో ఒక పేపర్ గా రెండు సెమిస్టర్ ల లో చదివి త్రుప్తి పడ్డాను.

ఇక కాలేజ్ స్థాయి లో మాకు దొరికిన అపురూపమైన లెక్చరర్ శ్రీమతి పద్మజ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ మాకు సోషియాలజీ టీచ్ చేసే వారు. ఆవిడ మమ్మల్ని వ్యక్తులుగా మలిచిన తీరు అద్భుతం. మేము ఆ క్లాస్ లో చేరేటప్పటికి ఆవిడ మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు. ఆవిడ తిరిగి డ్యూటీ లో చేరే వరకు ఇంకొక వ్యక్తి మాకు ఆ సబ్జక్ట్ టీచ్ చేశారు. మాకు ఏమీ బోధ పడక, ఆ సబ్జక్ట్ మూడు సంవత్సరాలు ఎలా చదవాలో, ఎలా పాస్ అవ్వగలమో తెలియక ఒక అయోమయ అవస్థలో ఉన్నాము.

ఆవిడ డ్యూటీ లో చేరగానే, మా ఆత్మీయురాలు ఎవరినొ చూసినట్లు (అంతకు ముందు మేము ఆవిడని ఎరగము) భావించి, ఆ సబ్జక్ట్ పట్ల మా భావాలు, అభిప్రాయాలు ఏకరువు పెట్టాము. ఆవిడ ఒక చిరునవ్వుతో మమ్మల్ని చూసి, ఇన్ని మాటలు ఆ విషయం గురించి ఇంత ధాటిగా, నమ్మకంతో మాట్లాడిన మీకు ఆ ఇయర్ సిలబస్ అంతా వచ్చేసింది, ఇంక దేని గురించి మీ భయం అనేటప్పటికి ఆశ్చర్యపోవటం మా వంతు అయింది.

ఏదైనా మనం గమనించటాన్ని బట్టే, ఆ విషయం పట్ల మన ఆసక్తి, శ్రద్ధ తెలిసి పోతుంది అని చెప్పేవారు.

ఆవిడ మాతో మాట్లాడే విధాన్ని బట్టి మేము కాలేజ్ లో మిగిలిన సబ్జక్ట్ ల గురించి ఆవిడతో నిర్భయం గా చర్చించే వాళ్ళం. ఒక సారి ఇంగ్లీష్ లో "సర్వేపల్లి రాధాక్రిష్ణన్" వ్రాసిన పాఠం మాకు బాగా అర్ధం అయి, "జవహర్లాల్ నెహ్రూ" పాఠం అర్ధం కాలేదు అని చెబితే, మమ్మల్ని చూసి ఆవిడ మీరు మేధావులు, మీకు రాధాక్రిష్ణన్ అర్ధం అయి, నెహ్రూ అర్ధం కాలేదు అంటే, కేవలం మీ శ్రద్ధలో లోపమే కానీ ఇంకొకటి కాదు. రోజూ నా కోసం ఒక గంట చదవండి, ఏదైనా ఇట్టే అర్ధం అవుతుంది అని మమ్మల్ని వెన్ను తట్టిన విధం మమ్మల్ని ఆశ్చర్య చకితులని చేసి మమ్మల్ని ఆవిడకి మరింత దగ్గర చేసింది.

అంతే కాదు, మేము సోషియాలజీ లో పాఠాంతర్గతం గా కొన్ని గిరిజన తెగల గురించి చదువుతూ, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి గేలి చేసినప్పుడు, స్రుష్టి లో ప్రతి విషయం పట్ల సదవగాహన ఉండాలనీ, ఏ జీవన విధానం అయినా, ఆచారం పాటించటానికైనా ఎంతో చరిత్ర మరియు ప్రాక్రుతిక లభ్యతలు/అలభ్యతలు కారణమని చెబుతూ మమ్మల్ని సరి అయిన దారిలో అలోచింప చేశారు.

ఏ విషయం పట్ల చులకన భావం, హేళన పనికి రావని చెప్పే వారు. సహ్రుదయం పెంచుకోవాలని చెప్పే వారు.

ఆ అలవాటే ఇప్పటికీ నన్ను ఒక విషయం పట్ల ప్రెజుడిస్ పెంచుకోకుండా విశాల ద్రుక్పధం తో అలోచించే స్థాయి కి ఎదిగేలా చేసింది. అది గురువు గా ఆవిడ మాకు చేసిన గొప్ప ఉపకారం.

కానీ మా దురద్రుష్టం కొద్దీ ఆవిడ ఇప్పుడు లేరు, ఆవిడ బోధనలు జీర్ణం చేసుకుని ఎదిగిన వ్యక్తులుగా క్రుతఙ్ఞతలు తెలియ జేసుకునే అవకాశం మాకు లేనందుకు బాధపడటం తప్ప ఏమి చెయ్యగలము?

కానీ ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడినా ఆవిడ గురించి ప్రస్తావించకుండా ఒక్క మాట కూడా చెప్పలేను. అర్ధవంతంగా నేను మాట్లాడే ప్రతి మాట లోనూ ఆవిడ సజీవంగా తొంగి చూస్తూ ఉంటారు.

అలాగే నేను ఎమ్మే లో చేరాక మాకు జోసెఫ్ అనే ఒక ప్రొఫెసర్ స్టాటిస్టిక్స్ టీచ్ చేసే వారు. ఆయన కూడా మాకు జీవితం గురించి వాస్తవ ద్రుష్టి ఎలా ఏర్పరుచుకోవాలో చెప్పే వారు. ఏదో ఒక సంఘటన ని బట్టి ఒక వ్యక్తి ని అంచనా వెయ్యకూడదు, అవతలి వారి షూ లో కాళ్ళు పెట్టి, ఆ సందర్భం లో ఉంటే మనము ఎలా ప్రవర్తించేవాళ్ళము అని ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలే కానీ తొందర పడి వ్యక్తిత్వాల పట్ల దురభిప్రాయాలు ఏర్పరచుకోవద్దు అని చెప్పేవారు.

ఈ విధం గా నాకు దొరికిన మంచి గురువులు, మార్గ నిర్దేశకుల గురించి తల్చుకోవటంద్వారా, నా ఙ్ఞాపకాలని, అద్రుష్టాన్ని మీతో పంచుకోవటానికి నేను చేసిన చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.

గురువుని గౌరవించటం అంటే మన ని మనము గౌరవించుకోవటం, మన వారసత్వాన్ని, వ్యవస్తని గౌరవించటం అన్న మాట.

గురువుని అగౌరవపరిచే నేటి హీన స్థితి నించి మళ్ళీ మనల్ని మనము సంస్కరించుకుందాము అని ఈ రోజున ప్రమాణం చేద్దామా!

No comments:

Post a Comment