Sunday, September 5, 2010

గురు వందనం

శ్రీ గురుభ్యోనమః

స్రుష్టి లోని గురువులందరికి పాదాభివందనాలు చెయ్యటానికి ఒక ప్రత్యేకమైన దినం ఏమీ అక్కరలేక పోయినా, ఒక సాంప్రదాయాన్ని పాటిస్తున్నాము కనుక ఇవ్వాళ్ళ విశేషమైన దినం గా మరింత శ్రద్ధ గా గురువుని తల్చుకుందాము.

ముందుగా "మమతాను రాగాల కల్పతరువై, మంచి చెడు నేర్పించు మాత్రు పద పద్మముల కిదె తొలి వందనం"(ఒక కవి గారి మాట).

ఒక వ్యక్తి జీవితం లో అత్యంత ప్రముఖమైన స్థానం తల్లిదండ్రులది. వీరిలో కూడా తల్లి నే ముందుగా తల్చుకుంటారు ఎందుకంటే, తల్లి తొలి గురువు. ఆ తరువాతి స్థానం ఆచార్యుడిది.ఆచార్యుడి స్థానం విశిష్టమైనది.

అందుకే మన సాంప్రదాయం లొ "మాత్రు దేవోభవ, పిత్రు దేవోభవ,అచార్య దేవోభవ" (తరువాత అతిధి దేవొభవ అంటారు, ఆ ప్రస్తావన ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి)అంటాము.

గురువు అనే ప్రస్తావన రాగానే, మనకి ముందు గా గుర్తు వచ్చేది, గురు దత్తాత్రేయ, మేధా దక్షిణా మూర్తి, ఒక విశ్వామిత్రుడు, ఒక పరశురాముడు,తరువాత మానవ శరీరాన్ని స్వీకరించి జగత్తుని ఉద్ధరించిన జగద్గురు ఆది శంకరాచార్య, ఒక ద్రోణాచార్య, మొదలైన వారు.

ఈ కాలం లో అయితే, ఒక సర్వేపల్లి రాధాక్రిష్ణన్, ఒక అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం గారిని, మీకు దైవమూ,గురువూ ఒకే సారి ప్రత్యక్షం అయితే మీరు ముందు గా ఎవరికి నమస్కరిస్తారు అని అడిగితే, తొలి నమస్కారం గురువుకే అని చెబుతూ, ఆ దైవాన్ని కూడా చూపించింది గురువే కదా అని వివరణ ఇవ్వటం జరిగింది. అది, గురువు యొక్క స్థానం.

ఇక ఆది శంకరాచార్య విషయం లో గురు అనుగ్రహం ఉంటే సాధించలేనిది లేదని నిరూపించారు. ఒక రోజు పాఠం మొదలు పెట్టకుండా, కొంచెం సేపు ఆగివేచి చూస్తున్నారట. మిగిలిన శిష్యులు ఆచార్యా, అందరము ఉన్నాము కదా, ఎవరి కోసం వేచి ఉన్నారు అని అడిగితే, తోటకాచార్యుడు రావాలి కదా అన్నారట.అతనికి మేధస్సు తక్కువ, అతను శారీరక శ్రమ చేసే వ్యక్తే కానీ, చెప్పింది గ్రహించగల నేర్పు కానీ, ధారణ చెయ్యగల మేధస్సు కానీ లేవు అని మిగిలిన శిష్యులు వ్యాఖ్యానిస్తే, గురువుగారు నవ్వి తోటకాచార్యుడిని పిల్చి, శ్లోకాలు చెప్పమంటే ఆశువుగా గురువు గారి మీద చెప్పిన స్తోత్రాలు విని ఆశ్చర్య పోవటం మిగిలిన శిష్యుల వంతు అయిందిట. ఈ నాటికీ గురు వందనానికి ఆ శ్లోకాలే ప్రామాణికం గా చెప్పబడుతున్నాయి.

అది గురు అనుగ్రహమంటే.

శిష్యులని పరిశీలన గా చూసి ఎవరి శక్తి ఎంతో, ఎవరికి ఎందులో నైపుణ్యం ఉన్నదో అంచనా వేసి అందులో వారిని నిష్ణాతులని చెయ్యటమే గురువు గారు చేసే పని. అది వారికి జీవితం లో ముందు ముందు సరి అయిన దారి చూపిస్తుంది అని మన సనాతన ధర్మం, చరిత్ర,మరియు అనుభవము చెబుతున్నాయి.

ఇంక నా విషయానికి వస్తే, ప్రాధమిక విద్యా స్థాయి నించి చెప్పుకుంటూ వస్తే -

7త్ క్లాస్స్ లో ఉండగా, విజయవాడలో, మా తెలుగు టీచర్ ఒక నాడు (నేను సంవత్సరం మధ్యలో ఆ స్కూల్ లో చేరటం జరిగింది)బాల క్రిష్ణ లీలల నించి "చల్దులారగించుట" అనే పద్య భాగం లో ఒక పద్యం లోని ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దెబ్బ వేసి నా సహాధ్యాయి చేత చెప్పించటం చూసి, భయం తో నేను అప్పటికప్పుడు నోటికి నేర్చుకున్న పద్యం ఇప్పటికీ నా మనసులో అలా ఉండి పోయింది.

ఇక 10త్ క్లాస్స్ కి మేము హైదరాబాద్ కి రావటం జరిగింది. అక్కడ కేశవ్ మెమోరియల్ స్కూల్ లో మాకు లెక్కలకి ప్రమీల టీచర్ వచ్చే వారు. ఆవిడ మొట్ట మొదటి రోజు నన్ను చూసి, కొత్త స్టూడెంట్ ని అనుకోకుండా, నా తెలివితేటలు తెలియక పోయినా, ఒక్క సారిగా నా భుజం తట్టి నువ్వు మ్యాథ్స్ లో నేషనల్ అవార్డ్ తెచ్చుకుంటావా అని అడగటం నాకు మనో ఫలకం మీద అలా ముద్ర పడి పోయింది. ఆవిడ లెక్కలు చెప్పే విధం ఎంత సులువు గా ఆత్మీయం గా ఉండేదో చెప్పాలంటే, ఆ స్కూల్ లో ఒక బిలోయావరేజ్ విద్యార్ధి కూడా 90% పైన మార్కులు తెచ్చుకోవటం చూస్తే అర్ధం అవుతుంది. ఆవిడ తర్ఫీదులో నేను ఎప్పుడూ, ఎలాంటి కొత్త లెక్క ఇచ్చినా వెంటనే నిముషాలలో చేసే దాన్ని. లెక్కల పట్ల నాకు ఉన్న ఇంట్రస్ట్ ని, నేను ఇంట్లో వాళ్ళ లెక్కల భయం వలన,కొన సాగించలేక పోయాను.

మళ్ళీ ఎమ్మే స్థాయి లో, ఎకనామిక్స్ లో ఒక పేపర్ గా రెండు సెమిస్టర్ ల లో చదివి త్రుప్తి పడ్డాను.

ఇక కాలేజ్ స్థాయి లో మాకు దొరికిన అపురూపమైన లెక్చరర్ శ్రీమతి పద్మజ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆవిడ మాకు సోషియాలజీ టీచ్ చేసే వారు. ఆవిడ మమ్మల్ని వ్యక్తులుగా మలిచిన తీరు అద్భుతం. మేము ఆ క్లాస్ లో చేరేటప్పటికి ఆవిడ మెటర్నిటీ లీవ్ లో ఉన్నారు. ఆవిడ తిరిగి డ్యూటీ లో చేరే వరకు ఇంకొక వ్యక్తి మాకు ఆ సబ్జక్ట్ టీచ్ చేశారు. మాకు ఏమీ బోధ పడక, ఆ సబ్జక్ట్ మూడు సంవత్సరాలు ఎలా చదవాలో, ఎలా పాస్ అవ్వగలమో తెలియక ఒక అయోమయ అవస్థలో ఉన్నాము.

ఆవిడ డ్యూటీ లో చేరగానే, మా ఆత్మీయురాలు ఎవరినొ చూసినట్లు (అంతకు ముందు మేము ఆవిడని ఎరగము) భావించి, ఆ సబ్జక్ట్ పట్ల మా భావాలు, అభిప్రాయాలు ఏకరువు పెట్టాము. ఆవిడ ఒక చిరునవ్వుతో మమ్మల్ని చూసి, ఇన్ని మాటలు ఆ విషయం గురించి ఇంత ధాటిగా, నమ్మకంతో మాట్లాడిన మీకు ఆ ఇయర్ సిలబస్ అంతా వచ్చేసింది, ఇంక దేని గురించి మీ భయం అనేటప్పటికి ఆశ్చర్యపోవటం మా వంతు అయింది.

ఏదైనా మనం గమనించటాన్ని బట్టే, ఆ విషయం పట్ల మన ఆసక్తి, శ్రద్ధ తెలిసి పోతుంది అని చెప్పేవారు.

ఆవిడ మాతో మాట్లాడే విధాన్ని బట్టి మేము కాలేజ్ లో మిగిలిన సబ్జక్ట్ ల గురించి ఆవిడతో నిర్భయం గా చర్చించే వాళ్ళం. ఒక సారి ఇంగ్లీష్ లో "సర్వేపల్లి రాధాక్రిష్ణన్" వ్రాసిన పాఠం మాకు బాగా అర్ధం అయి, "జవహర్లాల్ నెహ్రూ" పాఠం అర్ధం కాలేదు అని చెబితే, మమ్మల్ని చూసి ఆవిడ మీరు మేధావులు, మీకు రాధాక్రిష్ణన్ అర్ధం అయి, నెహ్రూ అర్ధం కాలేదు అంటే, కేవలం మీ శ్రద్ధలో లోపమే కానీ ఇంకొకటి కాదు. రోజూ నా కోసం ఒక గంట చదవండి, ఏదైనా ఇట్టే అర్ధం అవుతుంది అని మమ్మల్ని వెన్ను తట్టిన విధం మమ్మల్ని ఆశ్చర్య చకితులని చేసి మమ్మల్ని ఆవిడకి మరింత దగ్గర చేసింది.

అంతే కాదు, మేము సోషియాలజీ లో పాఠాంతర్గతం గా కొన్ని గిరిజన తెగల గురించి చదువుతూ, వాళ్ళ ఆచార వ్యవహారాల గురించి గేలి చేసినప్పుడు, స్రుష్టి లో ప్రతి విషయం పట్ల సదవగాహన ఉండాలనీ, ఏ జీవన విధానం అయినా, ఆచారం పాటించటానికైనా ఎంతో చరిత్ర మరియు ప్రాక్రుతిక లభ్యతలు/అలభ్యతలు కారణమని చెబుతూ మమ్మల్ని సరి అయిన దారిలో అలోచింప చేశారు.

ఏ విషయం పట్ల చులకన భావం, హేళన పనికి రావని చెప్పే వారు. సహ్రుదయం పెంచుకోవాలని చెప్పే వారు.

ఆ అలవాటే ఇప్పటికీ నన్ను ఒక విషయం పట్ల ప్రెజుడిస్ పెంచుకోకుండా విశాల ద్రుక్పధం తో అలోచించే స్థాయి కి ఎదిగేలా చేసింది. అది గురువు గా ఆవిడ మాకు చేసిన గొప్ప ఉపకారం.

కానీ మా దురద్రుష్టం కొద్దీ ఆవిడ ఇప్పుడు లేరు, ఆవిడ బోధనలు జీర్ణం చేసుకుని ఎదిగిన వ్యక్తులుగా క్రుతఙ్ఞతలు తెలియ జేసుకునే అవకాశం మాకు లేనందుకు బాధపడటం తప్ప ఏమి చెయ్యగలము?

కానీ ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడినా ఆవిడ గురించి ప్రస్తావించకుండా ఒక్క మాట కూడా చెప్పలేను. అర్ధవంతంగా నేను మాట్లాడే ప్రతి మాట లోనూ ఆవిడ సజీవంగా తొంగి చూస్తూ ఉంటారు.

అలాగే నేను ఎమ్మే లో చేరాక మాకు జోసెఫ్ అనే ఒక ప్రొఫెసర్ స్టాటిస్టిక్స్ టీచ్ చేసే వారు. ఆయన కూడా మాకు జీవితం గురించి వాస్తవ ద్రుష్టి ఎలా ఏర్పరుచుకోవాలో చెప్పే వారు. ఏదో ఒక సంఘటన ని బట్టి ఒక వ్యక్తి ని అంచనా వెయ్యకూడదు, అవతలి వారి షూ లో కాళ్ళు పెట్టి, ఆ సందర్భం లో ఉంటే మనము ఎలా ప్రవర్తించేవాళ్ళము అని ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలే కానీ తొందర పడి వ్యక్తిత్వాల పట్ల దురభిప్రాయాలు ఏర్పరచుకోవద్దు అని చెప్పేవారు.

ఈ విధం గా నాకు దొరికిన మంచి గురువులు, మార్గ నిర్దేశకుల గురించి తల్చుకోవటంద్వారా, నా ఙ్ఞాపకాలని, అద్రుష్టాన్ని మీతో పంచుకోవటానికి నేను చేసిన చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం.

గురువుని గౌరవించటం అంటే మన ని మనము గౌరవించుకోవటం, మన వారసత్వాన్ని, వ్యవస్తని గౌరవించటం అన్న మాట.

గురువుని అగౌరవపరిచే నేటి హీన స్థితి నించి మళ్ళీ మనల్ని మనము సంస్కరించుకుందాము అని ఈ రోజున ప్రమాణం చేద్దామా!

Wednesday, September 1, 2010

నేటి తరం పిల్లల భావాలు -పిచ్చా పాటి గా

నిన్న నేను పేపర్ చదువుతూ వ్యాపార ప్రకటనల పుణ్యమా అని తల్లి అనే వ్యక్తి,అచ్చం ప్రకటనల్లో చూపించినట్లు, ఎలా ఉండాలని తాము కోరుకుంటున్నారో చెప్పిన పిల్లల (15-16సంవత్సరాల వయసు ఉన్న)భావాలు చదివి ఆశ్చర్య పోయాను.

బట్టలు నలగకుండా, జుట్టు చెరగకుండా, మొహం లో అలసట కనిపించకుండా సదా మీ సేవ లో అనేట్లు కనిపిస్తూ అత్యంత ఆదర్శ వంతం గా, ఆధునికం గా, ఆంగ్ల భాషని అనర్గళం గా మాట్లాడుతూ, ఎప్పుడు ఫ్రెష్ గా చిరు నవ్వు నవ్వుతూ, పిల్లలని అస్సలు కోప్పడకుండా ఉండాలని నేటి తరం పిల్లలు కోరుకుంటున్నారని తెలిసి ఒకింత నిర్ఘాంత పోయాను.

ఈ పిల్లలకి తండ్రుల పట్ల పెద్ద గా ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవుట.

బాగుంది వినటానికి. ఎందుకంటే మన సనాతన ధర్మం ముందే స్త్రీ (గ్రుహిణి కూడా అనుకోవచ్చు) కి ఉండవలసిన లక్షణాలని ఆరు విధాలుగా నిర్వచించింది. అవి "కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాతా, రూపేచ లక్ష్మి, శయనేషు రంభ, క్షమయా ధరిత్రీ" అని. మరి నేటి తరం పిల్లలకి కూడా తల్లుల పట్లే నిర్దుష్టమైన అభిప్రాయాలు, కోరికలు. తండ్రులకి మినహాయింపు ఇచ్చేశారు.

కానీ ఆ సదరు పత్రిక ప్రతినిధులు, మరి మీ తల్లి దండ్రుల కోరిక ప్రకారం మీరు నడుచుకోగలరా అని ప్రశ్నించలేదు. అలాగే, ఇవ్వాళ్టి రోజున మిమ్మల్ని తీర్చి దిద్ది మీ అవసరాలు అన్నీ తీర్చిన తల్లిదండ్రులని వ్రుద్ధాశ్రమాలకి పంపించటం గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగి ఉంటే ఏమి జవాబు చెప్పే వారో?

తల్లి పాత్రని వ్యాపార ప్రకటనలు నిర్ణయించటం ఎంత బాధాకరము!

ప్రకటనల్లొ, అర్ధ రాత్రి వరకు చదువుకుంటూ ఉండే పిల్ల/పిల్ల వాడికి తల్లి ఫ్రెష్ గా చెదరని చిరునవ్వుతో ఏదో ఒక హెల్త్ డ్రింక్ తెచ్చి ఇస్తుంది.

చదువుకునే పిల్లల అవసరాలు తల్లి తీర్చవలసిందే. కానీ తెల్లారి లేస్తే అనేక సమస్యలతో ఇంటా, బయటా సతమతమవుతున్న నేటి మహిళ, ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వహిస్తూ ఇలా ప్రకటనల్లొ చూపించినట్లు, ఉన్న ఇద్దరో, ముగ్గురో పిల్లలకి ఎప్పుడు అవసరం వస్తె అప్పుడు చిరునవ్వులతో సేవ చెయ్యటం సాధ్యమేనా? అని పిల్లలు అలోచించేట్లు చెయ్యగలిగితె బాగుంటుందేమో కదా.

మన కోరికలు, ఆదర్శాలు అవతలి వ్యక్తులకి మాత్రమే చెందిన విషయమని, అందుకు అనుగుణం గా మనం ఏమి మారక్కరలేదని,పిల్లలు అనుకోకూడదు. అదేదో "ఎదుటి మనిషికి చెప్పేటందుకె నీతులు ఉన్నాయి" అన్నట్లు ఉంటుంది.

కుటుంబ బాధ్యతలు, తోటి కుటుంబ సభ్యుల పట్ల మన బాధ్యత, పెద్ద తరం వాళ్ళ పట్ల సానుభూతి,ప్రేమ,కుటుంబం లో మన పాత్ర తెలుసుకునే అవకాశం పూర్వం ఉమ్మడి కుటుంబాలలోసహజం గా ఉండేది.నేడు అది క్రమంగా సన్నగిల్లి పోతున్నది.కుటుంబం లో ఎవరి పాత్రకి ఉండే పరిధులు వారికి ఉంటాయని, అందరూ వాటిని గౌరవించాలని, మన అవసరాలని,ప్రవర్తనని ఆ పరిధిలో ఇముడ్చుకోవాలనీ పిల్లలకి సులభం గా తెలిసేది.

పిల్లలకేమి తెలుసు పాపం, వాళ్ళు మైనం ముద్దల లాంటి వాళ్ళు, ఏ మూస లో పోస్తే ఆ రూపాన్ని సంతరించుకుంటారు.

ఈవ్యాపార ప్రకటనలు (అన్నీ అనను కానీ)ఏదో నేల ని విడిచి ఆకాశం లో విహరించటం లాగా ఉంటున్నాయి.
నిష్టూరం గానూ, చేదు గానూ ఉండే నిజాలని భరించే శక్తి ని ఏ వ్యాపార ప్రకటన అయినా ఎందుకు కోరుకుంటుంది? వాళ్ళకి కావలసింది డబ్బు సంపాదించుకోవటానికి కావలసిన మాటల చేతల ఇంద్ర జాలం.


పిల్లలందరూ నేల విడిచి సాము చేస్తున్నారు అని కాదు నా భావం.కానీ ద్రుశ్య మాధ్యమానికి ఉన్న శక్తిని అత్యంత నేర్పు గా డబ్బు చేసుకోవటానికి పిల్లలని మాధ్యమంగా వాడుకుంటున్న వాళ్ళ వల్ల ప్రభావితం అవుతున్న పిల్లల సంగతే నేను చెప్పదల్చుకున్నది.

సమాజం లొ మార్పులు వేగం గా వస్తున్నాయి.ప్రతి సమస్య కుటుంబ స్థాయి లో ఏర్పడి తరువాత సామాజిక స్థాయికి విస్తరిస్తున్నది.

అందువల్ల పిల్లలకి బాధ్యతలు, వాళ్ళ వంతు పాత్ర పట్ల అవగాహన, సర్దుబాటు తత్వం ప్రయత్న పూర్వకం గా నేర్పాలి.

అలా అవి తెలియక పోవటం వల్లనేపిల్లలుఇప్పుడు ఈజీ గోయింగ్ ధోరణి లో ఉంటూ, అదే సరి అయిన పద్ధతి అనుకుంటున్నారు. కొండ మీది కోతి కావాలి, అది దొరక్క పోతే ఆత్మ హత్య ఒక్కటే శరణ్యం అనే విపరీత పోకడలకి పోతున్నారు.

మానసికం గా బలహీనులు అవుతున్నారు. తాము జీవితం నష్ట పోతూ తల్లి దండ్రులని కూడా క్షోభ పెడుతున్నారు.

మన దేశం లో పిల్లలని పెంచే తీరుకు, పాశ్చాత్య దేశాల్లో పిల్లలని పెంచే తీరు కి మౌలికమైన తేడా ఉన్నది.

పిల్లల్లో అంతర్లీనం గా ఉండే అద్భుత శక్తి చైతన్యం పదును పెడితేనే వాళ్ళు భవిష్యత్తులో బాగా రాణిస్తారు అని మనము నమ్ముతాము. అందుకోసం అవసరమైతే మనము కొంచెం కఠినం గా పిల్లలతో వ్యవహరిస్తాము (కనీసం నటిస్తాము). వాళ్ళేమి మనకు శత్రువులు కాదు కదా. వాళ్ళల్లో అంతర్గతం గా ఉండే డైనమిక్ ఎనర్జీ ని వెలికి తీసే ప్రయత్నం ఒక పద్ధతి ప్రకారం చిన్నప్పటి నించి శిక్షణా విధానం లొ చొప్పిస్తాము. కోరుకున్నవన్నీ పొందాలంటే - కష్టపడాలనీ, ఏదీ ఆయాచితం గా దొరకదనీ చిన్నప్పటి నించీ నేర్పుతాము. వ్యామోహాలు మంచివి కాదనీ, నిగ్రహ శక్తి అవసరమనీ చెబుతాము.

ఈ ప్రకటనలని తయారు చేసే వాళ్ళు కేవలం మార్కెటింగ్ టెక్నిక్ లు అనుసరిస్తూ, మనసుని ఆకట్టుకునే ధోరణిలొ,పర్యవసానాలు ఊహించని పోకడలకి పోతున్నారు.

దాని వల్ల పాశ్చాత్యపు ప్రభావం మన పిల్లల తరం మీద చాలా బలం గా పడుతున్నది.
తల్లి దండ్రులు, కుటుంబ విలువలు అనేవి అర్ధం లేని మాటలు గా తోచటం వల్లనే ఇవ్వాళ్ళ ఇన్ని ఒంటరి తల్లి దండ్రుల జీవితాలు, వ్రుద్ధాశ్రమాల ఉనికి - విస్తరణకి అవకాశం ఏర్పడింది.

అది ఒక సామాజిక అంశం అయింది.

తల్లులు ఆదర్శం గా ఉండాలి అని పిల్లలు కోరుకోవటం అనే ఒక్క విషయం మీద ఈవిడ ఇంత ఘాటుగా స్పందించిందేమిటి అనుకోకండి, ఏ సమస్య అయినా చిన్న గానే మొదలవుతుంది, అది తీవ్ర రూపం దాల్చినప్పుడే పది మంది ద్రుష్టి లో పడుతుంది. కాదంటారా!